ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్నికల కమిషనర్ ముందు ఉంచిన అధికారుల బృందం
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమరభేరి మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉన్నత స్థాయి సమావేశంగురువారం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్తో పురపాలక, పంచాయతీరాజ్, పోలీసు ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ స్థానాలకు ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈనెల 21న, పురపాలక సంఘాలకు ఈనెల 24న గ్రామ పంచాయతీలకు 27న వేర్వేరు తేదీల్లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను అధికారుల బృందం ఎన్నికల కమిషనర్ ముందుంచింది.
ఈ నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియనుపూర్తి చేయాలంటే ఇదే ప్రత్యామ్నాయ మార్గమని ఈ సందర్భంగా అధికారులు ఎన్నికల కమిషనర్ వద్ద ప్రస్తావించారు. రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం నిధులు మార్చి నెలాఖరులోగా రావాలంటే ... ఈలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందని ఎస్ఈసీ దృష్టికి తెచ్చారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. పోలీసు బందోబస్తు, పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం తరఫున లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. ఇరవై నాలుగు గంటల్లో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి వివరాలు అందజేస్తామని ఉన్నతాధికారుల బృందం కమిషనర్కు తెలిపింది.
మార్చ్ 21 ..24 ..27 ..తేదీలలో ఏపీలో స్థానిక ఎన్నికలు?